త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (Warangal – Khammam – Nalgonda BY MLC Elections)కు, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)ను అధిష్టానం ప్రకటించింది. 2021 లో ఇదే స్థానం నుండి బిఆర్ఎస్ (BRS) తరుపున పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) విజయం సాధించారు. అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో మల్లన్న ఓటమి చెందారు. ఎమ్మెల్సీ స్థానం 2027 మార్చి వరకు ఉన్నప్పటికీ పల్లా రాజేశ్వర్..గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున జనగాం ఎమ్మెల్యే గా నిల్చుని విజయం సాధించారు. ఆ తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. దీంతో ఈ స్థానానికి గాను త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా తీన్మార్ మల్లన్న ను ప్రకటించింది.
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1982, జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పలు న్యూస్ చానెల్స్ లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా సుపరిచితుడయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2019లో జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు. 7 డిసెంబర్ 2021న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. కానీ ఆ తర్వాత వెంటనే బిజెపి నుండి బయటకు వచ్చి..గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తీన్మార్ మల్లన్న వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మల్లన్న తన వంతు కృషి చేసారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. మరి ఈసారైనా విజయం వరిస్తుందో లేదో చూడాలి.
Read Also : CM Jagan : బీజేపీకి విధేయుడినే.. చెప్పకనే చెప్పిన జగన్