Tamilisai: తెలంగాణ ప్రజల పట్ల నా ప్రేమ చిరస్థాయిగా ఉంటుంది.. తమిళిసై ఎమోషనల్

  • Written By:
  • Updated On - March 18, 2024 / 11:01 PM IST

Tamilisai: తమిళిసై తన గవర్నర్ పదవికీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తమిళనాడు ఎన్నికల బరిలో నిలుస్తుందని సమాచారం. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను అంటూ తమిళి సై ఎమోషన్ అయ్యారు. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుందని ఆమె అన్నారు.

నేను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు నన్ను వారి అక్కగా ఆదరించారు. మీ అచంచలమైన మద్దతు, ప్రేమ మరియు ఆప్యాయత ఎంతగా నాహృదయాన్ని తాకాయో నేను మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నానని తమిళి సై వెల్లడించారు. మీతో పంచుకున్న ప్రతి క్షణం నాపై చెరగని ముద్ర వేసింది. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి ప్రగతికి పాటు పడ్డాము. బోనాలు, బతుకమ్మ తదితర పండుగలు జరుపుకున్నాం.. మీ అచంచలమైన మద్దతు, సహృదయత నాకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మాజీ గవర్నర్ అన్నారు. నేను గవర్నర్ పదవికి వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా, మీలో ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అభిమానం చాటుకున్నారామె.

‘‘తెలంగాణా ప్రజల పట్ల నా ప్రేమ చిరస్థాయిగా ఉంటుంది. మన అద్భుతమైన ప్రయాణం, చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో నేను తెలంగాణ వీడుతున్నాను. కృతజ్ఞతలు మరియు హృదయపూర్వక నమస్కారాలతో’’ తమిళి సై అన్నారు.