Tamilisai : కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ గవర్నర్గా సేవలందించిన తమిళిసై ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయ్యారు. తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల్లోనే తమిళనాడులోని అన్ని స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఇప్పుడు లీజర్గా ఉన్న తమిళిసై సేవలను తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ వాడుకోనుంది. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఎంపిక చేసిన స్టార్ క్యాంపెయినర్లలో తమిళిసై ఒకరు. అంతేకాదు తాజాగా ఆమెకు ఓ కీలక బాధ్యతను కూడా అప్పగించారు. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ ఇన్ఛార్జిగా తమిళిసైను(Tamilisai) నియమించారు.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని ఆమెకు కేటాయించాలని భావించారు. అయితే చివరకు హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ ఇన్ఛార్జిగా తమిళిసైకు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మాధవీలత బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఆమెకు తోడుగా తమిళిసై ప్రచారం మొదలుపెడితే.. ఆ స్థానంలో పార్టీకి కలిసొస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే అక్కడి పార్లమెంటరీ ఇన్ఛార్జి బాధ్యతలను తమిళిసైకి కేటాయించారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసే వరకు తమిళిసై హైదరాబాద్లోనే ఉండనున్నారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తో పాటు ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ తమిళిసై ప్రచారం చేసే అవకాశం ఉంది.