Kancha Gachibowli : ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే సీఎస్తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు విచారించే క్రమంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది. ‘‘కంచ గచ్చబౌలి భూముల్లో చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులను తీసుకున్నారా ? లేదా ? అనేది చెప్పండి’’ అని తెలంగాణ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘లాంగ్ వీక్ ఎండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారు’’ అని న్యాయస్థానం అడిగింది. ‘‘పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా మాకు చెప్పాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.
Also Read :Mukesh Ambani Jackpot : పెట్టుబడి రూ.500 కోట్లు.. లాభం రూ.10వేల కోట్లు.. అంబానీకి జాక్పాట్!
ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉంది : సీజేఐ
కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఈ కేసును విచారించారు. ఈరోజు విచారణ మొదలుకాగానే వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేవారు. ‘‘ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉంది’’ అని సీజేఐ మండిపడ్డారు. అయితే కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులూ జరగడం లేదని కోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వీ తెలియజేశారు. అనంతరం ఈ కేసు విచారణను జులై 23కు సీజేఐ వాయిదా వేశారు.
Also Read :Saraswati River Mystery : సరస్వతీ నది ఎలా అదృశ్యమైంది.. రీసెర్చ్లో ఏం తేలింది ?
400 ఎకరాల్లో చెట్ల నరికివేతపై స్టేటస్ కో
హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమి వ్యవహారంపై సుమోటోగా దాఖలైన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. గత విచారణ సందర్భంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) రిపోర్ట్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు 400 ఎకరాల్లో చెట్ల నరికివేతపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఆ గడువు నేటి(మే 15)తో ముగిసింది. కంచె గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్ ది ఛేంజ్ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. రెండు సార్లు ఈ కేసు విచారణకు రాగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధానంగా చెట్ల నరికివేతపైనే ఫోకస్ పెట్టింది. స్థానికంగా జీవిస్తున్న జంతుజాలాల పరిరక్షణను ప్రయార్టీగా తీసుకుంది.