తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్రంగా స్పందించారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై సీఎంల, హైకోర్టు జడ్జిల సమావేశంలో ఫైర్ అయ్యారు. హైకోర్టు సీజే జారీ చేసిన ఆదేశాలను సోమేశ్ కుమార్ అమలు చేయడం లేదని జస్టిస్ ఎన్వీ రమణ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలతో పాటు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా సోమేశ్ కుమార్ పెండింగ్లో పెడుతున్నారని మండిపడ్డారు.
న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామన్న జస్టిస్ ఎన్వీ రమణ, వాటిని అమలు చేయకపోవడం కారణంగా కోర్టుల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఉదయం ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేలతో మొదలైన సదస్సులోనే జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఆయన బదులుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఢిల్లీకి పంపారు. సమావేశంలో తెలంగాణ సీఎస్ను ప్రస్తావిస్తూ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను నోట్ చేసుకున్నామని,వాటిపై పరిశీలన చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలపడం కొసమెరుపు.