తెలంగాణలోని ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులలో (SLBC) ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar)స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు టన్నెల్లో చిక్కుకుపోయిన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు ప్రకటించారు. రైతుల పక్షాన వ్యవహరించి, సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడం తమ లక్ష్యమని మంత్రి తెలిపారు.
తమ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద పనులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో నీటి వనరుల వినియోగాన్ని మెరుగుపరచడం, రైతులకు అవసరమైన సాగునీటిని అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో DPR (Detailed Project Report) మరియు నిర్మాణం మధ్య తేడా ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం NDSA (National Dam Safety Authority) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తోందని వివరించారు. సరైన పరిశీలన అనంతరం ప్రాజెక్టులకు అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేపడతామని వెల్లడించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసి, రైతులకు ప్రయోజనం కల్పించడమే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.