Site icon HashtagU Telugu

SCCL : రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం

Singareni Agreement With Ra

Singareni Agreement With Ra

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన వ్యాపార విస్తరణలో మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా రాజస్థాన్ విద్యుత్ శాఖ(Rajasthan Power Department)తో 3,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలిగింది. ఈ ఒప్పందం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన సమావేశంలో సింగరేణి ప్రతినిధులు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సమక్షంలో కుదిరింది. ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు సింగరేణి – రాజస్థాన్ విద్యుత్ శాఖ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో సింగరేణికి 74% వాటా, రాజస్థాన్ విద్యుత్ శాఖకు 26% వాటా కలిగింది. ఖర్చులు, లాభాలను కూడా ఇదే ప్రమాణంలో పంచుకునేలా ఒప్పందాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రానికి దీర్ఘకాలికంగా స్థిర విద్యుత్ సరఫరా లభించే అవకాశముంది.

Hyderabad : హైదరాబాద్‌లో ఎన్ని అంతస్తుల వరకు నిర్మాణం జరుపుకోవచ్చు..?

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా తన కార్యకలాపాలను విస్తరిస్తూ, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, విద్యుత్ ఉత్పత్తిలో కూడా తన ప్రభావాన్ని చూపేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్ శాఖలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటూ పరిమితులను దాటే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.ఈ ఒప్పందం ద్వారా సింగరేణి విద్యుత్ ఉత్పత్తి రంగంలో తన ప్రభావాన్ని మరింత పెంచనుంది. థర్మల్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలకు, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.