Site icon HashtagU Telugu

Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?

Bharat Rice Price

Bharat Rice Price

Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు. తెలంగాణను డెవలప్ చేస్తామని అంటున్న కేంద్ర సర్కారు భారత్ రైస్‌ను ఇంకా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ బియ్యం హైదరాబాద్‌లోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతామని తొలుత అధికారులు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ రైస్(Bharat Rice) కోటాను కేటాయించలేదని, అందువల్లే రాష్ట్రంలో సప్లై మొదలుపెట్టలేదని నాఫెడ్ మేనేజర్ వినయ్ కుమార్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో నాన్ ఫోర్టిఫైడ్ రైస్ లేని కారణంగా బియ్యం కేటాయింపులు జరగలేదని అధికారులు అంటున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, హైదరాబాద్ నగరాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినా.. బియ్యం రాని కారణంగా భారత్ రైస్ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది.భారత్ రైస్ తెలుగు రాష్ట్రాలకు చేరకపోవడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం, తాత్సారం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ బ్రాండ్ బియ్యాన్ని ఈ కామర్స్ లో విక్రయిస్తామని కేంద్రం చెప్పినా అక్కడ కూడా అందుబాటులో లేవు. కారణాలు ఏవైనా రాయితీ బియ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభించక పోవడంపై పలువురు ఆహార సలహా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ‘భారత్ రైస్’ పేరిట పథకాన్ని కేంద్ర సర్కారు దేశవ్యాప్తంగా ప్రారంభించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ బియ్యాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాయితీ భారత్ రైస్ విక్రయించకున్నా ఆయా రాష్ట్రాల పౌర సరఫరాలశాఖ అధికారులు, మంత్రులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ రైస్ విక్రయానికి తెర లేపిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Also Read : Supreme Leader Banned : ఆ దేశాధినేతపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో బ్యాన్.. ఎందుకు ?

ప్రస్తుతానికి తెలంగాణలోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ఔట్ లెట్లలో గోధుమపిండి, శనగపప్పులను మాత్రమే అమ్ముతున్నారు. కిలో శనగపప్పు రూ. 60, కిలో గోధుమ పిండి రూ. 27.50 చొప్పున సేల్ చేస్తున్నారు. ఐదు కిలోల శనగపప్పు, గోధుమపిండి  బ్యాగులను విక్రయిస్తున్నారు. భారత్ రైస్‌ ఐదు కిలోలు, పది కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దీని సేల్స్ మొదలయ్యాయి. అయినా నేటికీ తెలంగాణకు ఆ బియ్యాన్ని కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.