తెలంగాణ బీజేపీ (TBJP) దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన ఆ పార్టీ వివిధ పార్టీల వైఫల్యాలు, అసంత్రుప్త నేతలపై ద్రుష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఏఐసీసీ అమలు కమిటీ ఛైర్మన్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖ పంపించారు.
అయితే కొద్దిసేపటి క్రితమే తరుణ్ చుగ్ ఇంటికి వెళ్లిన ఏలేటి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Nadda) సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ఈటల రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. గతకొన్నాళ్లుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి నిర్ణయాలను ఆయన బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనటం లేదు.
గతంలో రేవంత్కు (Revanth Reddy) పోటీగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టగా.. పార్టీ అధిష్ఠానం పాదయాత్ర ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తన పాదయాత్రను ఆపేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తన పాదయాత్రను ఆపేసి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వటంపై ఆయన మీడియా వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన బీజేపీ ఏలేటి తమ పార్టీలోకి చేర్చుకోవడంలో సఫలమైంది. అయితే రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నిర్మల్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏలేటి రూపంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఏలేటి బీజేపీలో చేరడంతో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలినట్టేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రేవంత్ రెడ్డి కారణంగానే ఏలేటి పార్టీ వీడారని మరికొందరి అభిప్రాయం. కారణాలు ఏమైనా ఏలేటి చేరిక బీజేపీకి మరింత బలం చేకూరిందని చెప్పక తప్పదు.
Also Read: MLC Kavitha: ఫేక్ చాట్ లతో దుష్ప్రచారం, సుఖేశ్ తో నాకెలాంటి పరిచయం లేదు!