Devagiri Express : దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ – ముంబై మధ్య నడుస్తుంటుంది. అయితే తాజాగా శనివారం ఉదయం ఆ రైలులోని బోగీల్లో ఏసీ పనిచేయలేదు. దీంతో ఊపిరి సలుపుకోలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం చేయాలో అర్థం కాక ఆగమాగమయ్యారు. కొంతమందికిి చెమటలు పట్టి.. వాంతులయ్యాయి. కొందరిని తలనొప్పి చుట్టుముట్టింది. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన దేవగిరి ఎక్స్ప్రెస్ (17058) ట్రైన్లో ఈ దుస్థితిని ఎదుర్కొన్న ప్రయాణికులు మిరజాపల్లి దగ్గర ట్రైన్ను ఆపించి నిరసన వ్యక్తం చేశారు. తమ ఆవేదన గురించి, ఎదుర్కొన్న అసౌకర్యం గురించి రైలులోని రైల్వే అధికారులకు తెలియజేశారు. లోకో పైలట్తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
We’re now on WhatsApp. Click to Join
సాధారణంగానైతే రైలు కంపార్ట్మెంట్లలో ఫ్యాన్ చెడిపోతే కిటికీ ఓపెన్ చేస్తే సరిపోతుంది. కానీ ఏసీ బోగీల్లో కిటికీలు ఉండవు. కాబట్టి ఆ బోగీల్లోని ప్రయాణికులు అస్వస్థతకు గరువుతారు. ఇదే విషయాన్ని లోకో పైలట్కు ప్రయాణికులు వివరించారు. టికెట్ డబ్బులు వసూలు చేసి తగిన సౌకర్యం కల్పించకుంటే ఎలా అని నిలదీశారు. ఈ క్రమంలోనే దేవగిరి ఎక్స్ప్రెస్లోని (Devagiri Express) ప్రయాణికులు రైల్వే శాఖకు ఓ లేఖ రాశారు. రైలును ప్రయాణికులు ఆపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రైల్వే మంత్రికి, రైల్వే శాఖకు ట్యాగ్ చేశారు. ప్రయాణికుల ఆందోళన అనంతరం ఈ రైలు గంట ఆలస్యంగా బయలుదేరినట్లు తెలుస్తోంది.