బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ఇవాళ మీడియాముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెలను హత్య చేయడానికి రూ.20 కోట్లు కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారని..కేసీఆర్ ప్రోత్సాహకంతోనే కౌశిక్ చెలరేగిపోతున్నారన్నారు. కేసీఆర్ ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. జమున వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలని ఈటెల, కోమటిరెడ్డి పార్టీ హైకమాండ్ ను కోరారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు నో చెప్పిన బీజేపీ హైకమాండ్.. ఈటల, రాజగోపాల్ రెడ్డి సహా పలువురు కీలక నేతలకు ఇతర బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది.
అయితే దీనిపై అంతగా సంతృప్తి చెందని ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల నడ్డా కార్యక్రమానికి ఈటల దూరంగా ఉండటం మరింత చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావాలని ఈటల, రాజగోపాల్ రెడ్డిలకు పిలుపునివ్వడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాల కారణంగా ఈటల ఏవైపు మొగ్గు చూపుతారోనని ఆయన అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ICC World Cup: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే!