Sathvik Suicide : సాత్విక్ ఆత్మహత్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ఇంటర్ బోర్డు విచార‌ణ క‌మిటీ

హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నార్సింగి బ్రాంచ్‌లోని సాత్విక్ అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్యకు

Published By: HashtagU Telugu Desk
Death Representative Pti

Death Representative Pti

హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నార్సింగి బ్రాంచ్‌లో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. తన తరగతి గదిలోనే సాత్విక్ ఆత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘటనలో ఇంటర్మీడియట్ విద్యా మండలి విచారణ కమిటీ సంచలనాత్మక విషయాలను వెల్లడించింది. సాత్విక్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల నార్సింగి బ్రాంచ్‌ విద్యార్థి కాదని తేలింది. కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న బ్రాంచ్‌లో కాకుండా వేరే బ్రాంచ్‌లో సాత్విక్‌కి తరగతులు నిర్వహిస్తున్నట్లు విచారణ కమిటీ గుర్తించింది. సాత్విక్ నార్సింగి బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి అని కాలేజీ యాజమాన్యం తమకు రశీదు ఇచ్చిందని సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బోర్డు అధికారులను వేడుకుంటున్నారు.

సాత్విక్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నిందితులపై చర్యలు తీసుకోవాలని సాత్విక్ తండ్రి రాజప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అడ్మిన్‌ ప్రిన్సిపాల్‌ ఎ. నరసింహాచారి అలియాస్‌ ఆచారి, ప్రిన్సిపాల్‌ టి.శివ రామకృష్ణారెడ్డి, హాస్టల్‌ వార్డెన్‌ కె. నరేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శోభన్‌బాబులను పోలీసులు అరెస్టు చేశారు.

  Last Updated: 06 Mar 2023, 07:08 AM IST