తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండగా, ఆ తర్వాత సంజయ్ జాజు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రేసులో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సంజయ్ జాజు వైపే మొగ్గింది. తెలంగాణ కేడర్కు చెందిన సంజయ్ జాజు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ సేవతోపాటు పలు కీలక ఐటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సంజయ్ జాజు చివరగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు.
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తితో, ఇటీవల మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి సంజయ్ జాజును రిలీవ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు కేటాయిస్తూ, కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) డైరెక్టర్ అన్నీస్ కన్మణి జాయ్ ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేశారు.
సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు 1992 బ్యాచ్కు చెందిన అధికారి కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తన పనులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ జిల్లా సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, కమిషనర్గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్గా కూడా సంజయ్ జాజు సేవలు అందించారు. మీ సేవ, మున్సిపల్ సేవల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చే ఐటీ ప్రాజెక్టులను సంజయ్ జాజు ప్రవేశపెట్టారు.
తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత 2014 అక్టోబర్లో డిప్యుటేషన్పై కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లిన సంజయ్ జాజు, గత 12 ఏళ్లలో కేంద్రంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు NHIDCLకు డైరెక్టర్గా పనిచేసిన సంజయ్ జాజు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, హిమాలయ సరిహద్దుల్లో వ్యూహాత్మక నేషనల్ హైవేలు, కఠినమైన టన్నెల్స్ నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టారు. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు రక్షణ మంత్రిత్వ శాఖలో రక్షణ ఉత్పాదక శాఖ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆత్మనిర్భర్ భారత్ను రక్షణ రంగంలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
