Site icon HashtagU Telugu

Sand Mafia : ఫారెస్ట్ సిబ్బందిపై శాండ్ మాఫియా దాడి… అర్థ‌రాత్రి పెట్రోల్ పోసి..

Sand mafia

Sand mafia

తెలంగాణ‌లో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కొత్త‌గూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో సోమవారం అర్థరాత్రి ఇసుక స్మగ్లర్లు ఎఫ్‌ఆర్‌వో, సిబ్బందిపై దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన మండలంలోని బండారుగుంపు గ్రామ సమీపంలోని తిరుమలకుంట రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలోని వాగుల నుంచి కొందరు ఇసుక స్మగ్లర్లు అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నట్లు దమ్మపేట ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) ఎన్.వెంకటలక్ష్మికి పక్కా సమాచారం ఉంది.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎఫ్‌ఆర్‌ఓ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతానికి చేరుకుని ట్రాక్టర్ల కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో బండారుగుంపు నివాసి బైట ధర్మారావు, బైట గోపాల్‌రావు, ఆయన కుమారుడు బైట సునీల్, కొరస సురేష్, కొరస దాసు తదితరులు ఎఫ్‌ఆర్‌వో, సిబ్బందిపై దాడి చేశారు. దుండగులు అటవీ శాఖ జీపు, ఎఫ్‌ఆర్‌ఓ, సిబ్బందిని చంపే ప్రయత్నంలో పెట్రోల్ పోశారు. అయితే దుండగుల నుంచి తప్పించుకుని వారంతా అశ్వారావుపేట చేరుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఆర్‌వో వెంకటలక్ష్మి అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version