Rythu Runa Mafi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రైతు రుణ మాఫీ (Rythu Runa Mafi)ని విజయవంతంగా అమలు చేసింది రేవంత్ సర్కార్. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో 11,50,193 మంది రైతులకు రూ.6098.93 కోట్లు రుణ మాఫీ చేసింది. రెండో విడతలో 6,40,823 మంది రైతులకు రూ.6190.01 కోట్లు రుణ మాఫీ చేసింది. మూడో విడతలో 4,46,832 మంది రైతులకు రూ.5644.24 కోట్లు రుణ మాఫీకి సర్వం సిద్ధం చేసింది. దీంతో మొత్తం మూడు విడతల్లో 22,37,848 రైతులకు సంబంధించిన రుణ మాఫీ క్లియర్ అయింది. దీంతో రైతుల ఖాతాల్లో రూ.17, 934 కోట్లు జమ అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది.
Also Read: Hero Vida V1 Plus : రూ. 18లో 100కి.మీలు పరిగెత్తుతుంది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా తక్కువే..!
జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది.
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులకు అసలైన స్వరాజ్యం వచ్చిందని.. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు ప్రకటించారు. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ అవుతాయి. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించనున్నట్లు రుణమాఫీ విధి విధానాల్లో ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది.