Bhu Bharathi : భూ సమస్యలకు చెక్ పెట్టిన రేవంత్ సర్కార్

Bhu Bharathi : “ప్రజల వద్దకే రెవెన్యూ” నినాదంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూముల పత్రాలు, సర్వేలు, రిజిస్ట్రేషన్లలో ఏర్పడిన లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయడం ముఖ్య ఉద్దేశం

Published By: HashtagU Telugu Desk
Check On Land Issues

Check On Land Issues

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం ‘భూభారతి’ (Bhu Bharathi) రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మారనుంది. జూన్ 3 నుండి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు (Revenue Conferences) నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. “ప్రజల వద్దకే రెవెన్యూ” నినాదంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూముల పత్రాలు, సర్వేలు, రిజిస్ట్రేషన్లలో ఏర్పడిన లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయడం ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వ వైఖరి వల్ల భూసంబంధిత సమస్యలు పెరిగాయని, ఇప్పుడు వాటికి శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా

భూభారతిని ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా, పైలట్ ప్రాజెక్ట్‌లో 55,000 దరఖాస్తులు రావడం వల్ల సమస్యల తీవ్రత బహిర్గతమైంది. ఇప్పటివరకు వాటిలో 60% సమస్యలు పరిష్కరించారని రెవెన్యూ శాఖ తెలిపింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ బృందం వెళ్లి దరఖాస్తులు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా ‘సాదా బైనామా’ల విషయంలో అధిక దరఖాస్తులు రావడంతో, మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచనలిచ్చారు. రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ వివాదాలకు ఈ చట్టం ద్వారా న్యాయ పరిష్కార మార్గం ఏర్పడనుంది.

కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపులు జతచేయడం తప్పనిసరి చేయడం ద్వారా భూ డాక్యుమెంట్లలో పారదర్శకత వస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొలతలు, భూదస్త్రాల నిర్వహణ కోసం మొదటి దశలో 6,000 సర్వేయర్లను నియమించనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారుల నియామక ప్రక్రియ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక అక్రమాలు జరిగాయని, భూభారతి చట్టంతో రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రెవెన్యూ వ్యవస్థలో నైతిక విలువలు, సమర్థత, ప్రజలపై విశ్వాసం పెరుగుతాయని ప్రభుత్వం నమ్ముతోంది.

  Last Updated: 03 Jun 2025, 12:29 PM IST