గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మెరుగైన ర్యాంకులు సాధిస్తూ గురుకుల ప్రతిష్ట పెంచుతుంటే.. మరోవైపు గురుకుల యజమాన్యాలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పాలకూర ఆకుల్లో ఉన్న వానపాము (earthworm)ను గమనించకుండా వంట సిబ్బంది వండిన పప్పు.. ఓ ఆశ్రమ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులను అస్వస్థతకు గురి చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల(Tribal Ashram Girls School)లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురికాగా, వీరిలో ఒకరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మానుకొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 953 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా? అని రేవంత్ ప్రశ్నించారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్ అంటూ ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు.
పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?
భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?
పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్. pic.twitter.com/itmuKie7oj
— Revanth Reddy (@revanth_anumula) July 30, 2022