కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పరాభవం జరిగింది. చంచల్ గూడ జైలులోని ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ తో పాటు రేవంత్ వెళ్లడానికి అనుమతించలేదు. దీని వెనుక ఏఐసీసీ రాసిన లేఖలోని సాంకేతిక తప్పిదంగా రేవంత్ అభిమానులు భావిస్తున్నప్పటికీ పరాభవాన్ని మాత్రం మరచిపోలేకపోతున్నారు. కేవలం శాసనసభాపక్ష నేతగా ఉన్న భట్టీ విక్రమార్క్ కు మాత్రమే రాహుల్ తో అనుమతించడం రేవంత్ ఫ్యాన్స్ కు ఆగ్రహం కలిగిస్తోంది.
రెండో రోజు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం చంచల్గూడ జైలుకు వెళ్లారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి చంచల్గూడ జైలుకు వెళ్లిన రాహుల్ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన ఎన్ఎస్యూఐ నేతలను లిశారు. అరెస్టులకు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఎన్ఎస్యూఐ నేతలకు రాహుల్ భరోసా ఇచ్చారు. చంచల్గూడ జైలు సందర్శనలో రాహుల్ వెంట మల్లు భట్టి విక్రమార్క మినహా మరెవ్వరినీ పోలీసులు జైలులోకి అనుమతించలేదు. రాహుల్ పర్యటనను తన భుజస్కందాలపై వేసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అనుమతించలేదు. దీనికి కారణమేంటంటే, టీపీసీసీ తరఫున చంచల్గూడ జైలు సందర్శనకు రాహుల్ను అనుమతివ్వాలంటూ రేవంత్ ఓ లేఖ రాశారు. అయితే ఆ లేఖకు జైళ్ల శాఖ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఏఐసీసీ రంగంలోకి దిగింది.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ నుంచి తెలంగాణ జైళ్ల శాఖకు అందింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంతకంతో వచ్చిన ఆ లేఖతో ఎట్టకేలకు జైళ్ల శాఖ రాహుల్ జైలు సందర్శనకు అనుమతించింది. అయితే ఆ లేఖలో జైలు లోపలికి రాహుల్తో పాటు భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించాలని మాణిక్కం ఠాగూర్ కోరారు. రేవంత్ పేరును ఆ లేఖలో ప్రస్తావించలేదట. ఈ కారణంగానే రాహుల్ వెంట చంచల్ గూడ జైల్లోకి ఒక్క భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించిన పోలీసులు రేవంత్ రెడ్డిని అనుమతించలేదు. ఫలితంగా ఘోరమైన పరాభవాన్ని రేవంత్ ఎదుర్కొన్నారు.