EWS Quota : పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలి – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను వెంటనే అమలు చేయాల‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...

Published By: HashtagU Telugu Desk
Revanth Reddy

Revanth Reddy

పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను వెంటనే అమలు చేయాల‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ కోటాను వెంటనే అమలు చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. టీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూసేలా సీఎం చేశారని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష తర్వాత నిరుద్యోగ యువతకు కొంత ఊరట లభించిందని ఆయన అన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కనీసం 60 మార్కులను నిర్ణయించిందని, ఎస్సీ అభ్యర్థులకు 20 శాతం కటాఫ్ మార్కులుగా, బీసీలకు 25 శాతం కటాఫ్ మార్కులు ఇచ్చారని ఆయన సీఎంకు వివరించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించలేదని ఆయన సీఎంకు తెలిపారు. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాను పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని, 15,000 మంది ఈడబ్ల్యూఎస్ ఆశావహులు నష్టపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

  Last Updated: 10 Nov 2022, 10:11 AM IST