Site icon HashtagU Telugu

Renu Desai: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం.. స్పందించిన రేణూ దేశాయ్!

Renu Desai

Renu Desai

Renu Desai: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదంపై సినీ నటి రేణూ దేశాయ్ స్పందించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం వినియోగించాలని ప్రతిపాదించడంతో విద్యార్థులు, పర్యావరణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ (Renu Desai) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆమె వీడియోలో “ఒక తల్లిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తున్నాను. మన పిల్లలకు ఆక్సిజన్ కావాలి. భవిష్యత్ తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి. అభివృద్ధి కోసం వేరే చోట భూమి చూసుకోండి” అని కోరారు. ఈ వివాదంలో జీవవైవిధ్యాన్ని కాపాడాలని, పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. రేణూ దేశాయ్ స్పందన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈ అంశంపై చర్చ మరింత తీవ్రమైంది. #SaveHCU, #SaveHCUBioDiversity వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆమె వాదనకు మద్దతు తెలుపుతూ అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.

హెచ్‌సీయూ వివాదం ఏంటీ?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చుట్టూ ఉన్న 400 ఎకరాల భూమి వివాదం ప్రస్తుతం తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగించాలని ప్రతిపాదించింది. దీనికి విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవాదులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

వివాదం నేపథ్యం

హెచ్‌సీయూ 1974లో స్థాపించబడినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,324 ఎకరాల భూమిని కేటాయించింది. కాలక్రమంలో ఈ భూమిలో కొంత భాగం వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత వివాదం కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతోంది. 2004లో ఈ భూమి ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయించబడింది. కానీ 2006లో ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2024లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనిదని నిర్ధారణ అయింది.

Also Read: Yoga Poses: అంద‌మైన చ‌ర్మం కోసం ఈ యోగాస‌నాలు వేయాల్సిందే!

ప్రభుత్వ వాదన

తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమి రాష్ట్రానికి చెందినదని, హెచ్‌సీయూకి సంబంధం లేదని వాదిస్తోంది. జూలై 2024లో యూనివర్సిటీ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించి, ఈ భూమి యూనివర్సిటీ సరిహద్దుల్లో లేదని నిర్ధారించినట్లు పేర్కొంది. ఈ భూమిని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తే రూ. 30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, ఈ భూమి అటవీ భూమి కాదని, పర్యావరణానికి హాని జరగదని స్పష్టం చేసింది.