రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో లబ్ధిదారులు భారీగా రేషన్ షాపులకు తరలివస్తున్నారు. ఒక్కసారిగా మూడు నెలల స్టాక్ ఇస్తుండటంతో, ఇప్పుడు గనుక తీసుకోకపోతే మళ్ళీ మూడు నెలల వరకు అవకాశం ఉండదేమోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. దీనివల్ల ఉదయం నుంచే వేలాది మంది క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. గంటల తరబడి నిలబడాల్సి రావడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాంకేతిక సమస్యలు మరియు నిండుకుంటున్న స్టాక్
అత్యధిక సంఖ్యలో ప్రజలు ఒకేసారి వస్తుండటంతో ‘ఈ-పోస్’ (e-PoS) యంత్రాలపై భారం పడి సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. వేలిముద్రలు పడకపోవడం, సర్వర్ మొరాయించడం వంటి కారణాలతో పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో స్టాక్ వేగంగా అయిపోతుండటంతో బియ్యం అందవనే భయం కార్డుదారులను వెంటాడుతోంది. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు కూడా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నెల 30 వరకు గడువు
రేషన్ పంపిణీపై నెలకొన్న గందరగోళంపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడు నెలల బియ్యం అందుతాయని హామీ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని, కాబట్టి ఒక్కరోజే అందరూ రావాల్సిన పని లేదని సూచించారు. స్టాక్ తక్కువగా ఉన్న చోట వెంటనే కొత్త లోడును పంపిస్తున్నామని, సర్వర్ సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అధికారులు తెలిపారు.
