కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం మీసేవ కేంద్రాల్లో (Meeseva Centers) దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో మీ సేవ సెంటర్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఇదే అదును చేసుకొని కొంతమంది మీసేవ సెంటర్ల యాజమాన్యాలు ప్రజల నుండి దోచుకోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు (New Ration Card Application) కోసం రూ.50కంటే ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేసింది. అయితే ప్రాక్టికల్గా ఈ నిబంధనలు అమలవుతున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ సహా పలు ప్రాంతాల్లో మీసేవ కేంద్రాలు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా, కొందరు మీసేవ నిర్వాహకులు రూ.50కు బదులుగా రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు.
TGSRTC : శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రయాణం ఇక సులభం..
ఈ దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. తమ హక్కుగా లభించాల్సిన రేషన్ కార్డు కోసం అధిక రుసుము చెల్లించాల్సి రావడం దారుణమని వారు చెబుతున్నారు. మీసేవ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తుంగలో తొక్కుతూ అక్రమంగా డబ్బు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులు ఈ సమస్యను గమనించి, దోచుకుతింటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డు పొందేలా కేవలం ప్రభుత్వం నిర్ణయించిన చెల్లింపులకే పరిమితంగా ఉండేలా కఠిన నియంత్రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.