Rapido: తెలంగాణలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్ల కోసం ర్యాపిడో బంపర్ ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్ లోని 2,600 పోలింగ్ కేంద్రాల్లో.. ఓటు వేసేందుకు వెళ్లేవారికి నవంబర్ 30న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించింది. ఓటర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ర్యాపిడో సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో ఓటర్ టర్నవుట్ ను పెంచాలని సంకల్పించినట్లు ఆ ప్రకటనలో వివరించింది. తమకు వీలైనంత వరకూ ఓటు వేసే యువతను పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. దేశానికి ఉన్న ప్రధాన ఆకర్షణలో ప్రజాస్వామ్యమే ముఖ్యమైనదని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ప్రతి ఓటు నమోదయ్యేలా ప్రయత్నిస్తున్నందుకు తాము ఎంతో గర్విస్తున్నామని వివరించారు. ఓటు వేయాలంటే ప్రయాణం చేయాలన్న ఆలోచనను మాని.. ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఎన్నికల రోజు ప్రతి పౌరుడు ఓటు వేసేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఫ్రీ బైక్ రైడ్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని హైదరాబాద్ ఓటర్లంతా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.