తెలంగాణలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ ఉజ్జయిని బోనాలు జరిగాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదని మండిపడ్డారు. ఆలయంలో పూజలు సరిగా జరగడం లేదనీ, గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలని సూచించారు.
నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని, రూపాన్ని స్థిరంగా ఉంచండి అంటూ హెచ్చరించారు. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు చేయాలనీ, ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నానని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించిన విషయం తెలిసిందే.