Rajalingamurthy Murder Case: భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యతో తెలంగాణలో రాజకీయంగా కలకలం రేగింది. ఈవిషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ రాజలింగమూర్తి గతంలో కేసు వేశారు. అందుకే ఆయన హత్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఈ కేసు మిస్టరీ వీడింది. భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగిందని వెల్లడించారు. ఈ హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక బీఆర్ఎస్ నేత కూడా ఉండటం గమనార్హం. ఈమేరకు వివరాలను ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వెల్లడించారు.
కీలకంగా హరిబాబు కాల్ డేటా
ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఐదుగురితో పాటు బీఆర్ఎస్ నేత, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు పాత్రపై పోలీసులు దృష్టిసారించారు. హత్య జరిగిన తర్వాత నమోదైన కాల్ డేటా రికార్డ్(సీడీఆర్)ను విశ్లేషిస్తున్నారు. రాజలింగమూర్తి హత్య జరిగినప్పటి నుంచి హరిబాబు పరారీలో ఉండడం అనుమానాలను తావిస్తోంది. ఫిబ్రవరి 19న(బుధవారం) సాయంత్రం 7.15 గంటలకు మర్డర్ జరగగా, ఆ టైంలో నిందితుల్లో ఒకరైన రేణిగుంట్ల సంజీవ్(ఏ1) హరిబాబుకు ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించారు. ఆ రోజు హరిబాబుతో మాట్లాడిన వాళ్లందరినీ పిలిపించి పోలీసులు విచారించారు. ఈవిధంగా భూపాలపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు రేషన్ డీలర్లు, ఒక వీఆర్ఏ, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఒక రియల్ఎస్టేట్ వ్యాపారి పేర్లు బయటికి వచ్చాయి. హరిబాబుకు సన్నిహితులైన ఖాశీంపల్లికి చెందిన ఇద్దరు ప్రధాన అనుచరులను కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ కేసులో హరిబాబు ప్రధాన నిందితుడు. రాజలింగమూర్తి హత్యకేసులోనూ హరిబాబు పేరే వినిపిస్తోంది.