రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.