Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ? ఖమ్మం, భువనగిరి, నల్గొండ లోక్సభ సీట్లలో ఏదో ఒక చోటు నుంచి బరిలోకి దిగుతారా ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి రాహుల్ పోటీ చేయడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఇండియా కూటమిలో భాగమైన సీపీఐ కేరళలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విశేషమేమిటంటే వాటిలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ సీటు, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు చెందిన తిరువనంతపురం సీటు కూడా ఉన్నాయి. సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య, సీపీఐ సీనియర్ నేత అన్నీ రాజాను వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు.
వాస్తవానికి కేరళలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయినప్పటికీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్పై ఒత్తిడిని పెంచేందుకు వామపక్షాలు వ్యూహరచన చేశాయని పరిశీలకులు అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఈసారి వయనాడ్ నుంచి పోటీ చేయకూడదని భావిస్తున్నారట. ఈసారి రాహుల్ గాంధీ తెలంగాణతో పాటు యూపీలోని రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేసే అంశంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఏమీ మాట్లాడలేదు. ఇదే సమయంలో వరుణ్ గాంధీ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
సోనియా లేదా రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీకి మరింత మంచి ఫలితాలు వస్తాయంటూ టీపీసీసీ నేతలు గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. సోనియా పోటీ చేయాలని తీర్మానం కూడా చేశారు. అయితే ఆమె పెద్దల సభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. అంతా రాహుల్గాంధీ రావాలనే కోరుతున్నారు. మరోవైపు, కర్నాటక నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనే వస్తోంది. ఢిల్లీ పెద్దలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. ఒకవేళ రెండుచోట్ల నుంచి పోటీ చేయాలని రాహుల్ భావిస్తే.. మళ్లీ అమేథీ నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.