Rahul Gandhi: రానున్న రోజుల్లో మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మేడిన్ తెలంగాణ సక్సెస్ అయ్యాక… ఆ తర్వాత మేడిన్ ఉత్తర ప్రదేశ్, మేడిన్ రాజస్థాన్… ఇలా అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేష దుకాణం తెరిస్తే… తెలంగాణలో ప్రజలు ప్రేమ దుకాణం తెరిచారన్నారు. మీకు… నాకు మధ్య ఉన్నది రాజకీయ బంధం కాదని… ఆత్మీయ బంధం, కుటుంబ బంధమని వ్యాఖ్యానించారు.
తాను బతికున్నంత కాలం తెలంగాణకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఇక్కడి యువత పిలిస్తే మీ ముందు ఉంటానన్నారు. చిన్న పిల్లవాడు పిలిచినా మీ ముందు నిలబడతానన్నారు. తాను తెలంగాణ ప్రజల సిపాయిలా ఢిల్లీలో ఉంటానన్నారు. దేశంలోని అవినీతిపరులంతా మోదీ ముందే నిలుచున్నారని విమర్శించారు.
కాగా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్గాంధీ, నేరుగా తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభ వచ్చారు. జనజాతర సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ‘న్యాయ పత్రం’ పేరిట కాంగ్రెస్ జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు.