Jaggareddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. జగ్గారెడ్డిని సంగారెడ్డి పులిగా అభివర్ణించారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే లీడర్ జగ్గారెడ్డి అని రాహుల్ గాంధీ చెప్పారు. ఆదివారం సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జగ్గారెడ్డి పెద్దపులి లాంటి వ్యక్తి. ఆయన కష్టపడి పని చేస్తారు. జగ్గారెడ్డి కష్టపడి పని చేయడాన్ని నేను భారత్ జోడో యాత్రలో చూశాను’’ అని రాహుల్ చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘నేను ప్రధాని మోడీపై పోరాటం చేస్తున్నాను. నాపై 24 కేసులు పెట్టారు. 60 గంటల పాటు ఈడీ నన్ను విచారించింది. నా అధికారిక కార్యాలయాన్ని కూడా లాక్కున్నారు. అయితే ప్రతి బీదవాడి గుండెల్లో ఇంకా నేను ఉన్నాను. కాబట్టి ఆ ఇల్లు నాకు అవసరం లేదు. అదే సమయంలో సీఎం కేసీఆర్పై ప్రధాని మోడీ ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్, మోడీ కలిసి పని చేస్తున్నారు. మోడీ, కేసీఆర్… వీరిద్దరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడమే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే చోట్ల మజ్లిస్ పార్టీ పోటీ చేసి బీజేపీకి లబ్ది చేకూరుస్తుంటుంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం పూర్తయిన తర్వాత జగ్గారెడ్డి మరో ఆసక్తికర విషయం చెప్పారు. ‘‘ఇదే మైదానంలో 1980వ దశకంలో మీ నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రసంగించారు’’ అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వెళుతున్న సమయంలో జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను పరిచయం చేశారు. తనకు రాహుల్ గాంధీ ప్రేమ తప్ప ఏదీ అవసరం లేదని జగ్గారెడ్డి(Jaggareddy) అన్నారు.