Raghurami Reddy : ఖమ్మం లోక్సభ సీటు ఎవరూ ఊహించని రీతిలో రామసహాయం రఘురాం రెడ్డికి దక్కింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తమ సన్నిహితుల కోసం ఈ సీటును పొందాలని భావించినా అది జరగలేదు. అందరినీ కాదని రాఘురామి రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫైనల్ చేసింది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నప్పటికీ .. మరోవైపు ఖమ్మం సీటు ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది. చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగి రాహుల్ గాంధీకి రెండు పేర్లను సిఫార్సు చేశారు. వాటిలో ఒక పేరును రాహుల్ ఎంపిక చేయడంతో ఖమ్మం సీటు ఎవరితో తేలిపోయింది. అది రామసహాయం రఘురామి రెడ్డికే(Raghurami Reddy) అని డిసైడ్ అయింది. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
రామసహాయం రఘురామి రెడ్డి ఎవరు ? అనే దాని గురించి చాలామంది గూగుల్లో వెతుకుతున్నారు. ఆయన పేరు చాలామందికి తెలియనప్పటికీ.. వారి ఫ్యామిలీకి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు బలమైన రాజకీయ పలుకుబడి ఉంది. ఆర్థికంగా కూడా ఆయన చాలా స్ట్రాంగ్. అందుకే రఘురాం రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపింది. అంతేకాదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడే ఈ రఘురామి రెడ్డి. ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఈయనకు వియ్యంకుడే.
ఖమ్మం లోక్సభ సీటును తన సొదరుడు ప్రసాద్ రెడ్డికి.. ఒకవేళ అది కుదరకుంటే వియ్యంకుడు రఘురామి రెడ్డికి ఇవ్వాలంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలంగా లాబీయింగ్ చేశారని తెలుస్తోంది. అది ఫలించి రఘురామి రెడ్డికి ఈ అవకాశం దక్కింది. పొంగులేటి కుటుంబసభ్యులకు ఈ టికెట్ రాకుండా అడ్డుకునేందుకు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్సభ సీటును తన భార్య నందిని కోసం సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తన కొడుకు యుగంధర్ కోసం సాధించాలని జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, వీహెచ్ హన్మంత రావు కూడా ఈ టికెట్ను ఆశించి భంగపడ్డారు.
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి రామసహాయం రఘురామి రెడ్డి నామినేషన్ సోమవారమే దాఖలైంది. ఆయన తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన అనుచరులు మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్ రెడ్డి, డాక్టర్ కోట రాంబాబు, రామ్మూర్తి నాయక్, ఎండీ ముస్తఫా, మలీదు జగన్, జొన్నలగడ్డ రవి, రమేశ్లు దాఖలు చేశారు.