Kavitha Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లను శుభ్రం చేస్తారు’’ అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టం చేయాలని కవిత కోరారు. హిందువులపై, హిందీ భాషపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న డీఎంకే పార్టీ నాయకుల విషయంలో ఇప్పటికైనా రాహుల్ మౌనం వీడాలని ఆమె సూచించారు. డీఎంకే పార్టీ అనేది ఇండియా కూటమిలో భాగమైనందున దాని నాయకుల వ్యవహారాల శైలిపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో యావత్ దేశానికి చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని కవిత(Kavitha Vs Rahul Gandhi) పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చూస్తుంటే.. అది పీఆర్ స్టంట్లాగా కనిపిస్తోందని చెప్పారు. భారత్ జోడో యాత్రలో దేశాన్ని ఏకం చేసే మాటలు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హిందువులపై, హిందీ భాషపై ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటున్నారని కవిత ఎద్దేవా చేశారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని.. వాటి గురించి మాట్లాడాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందన్నారు. హిందువులకు, హిందీ భాష మాట్లాడే వాళ్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదనే విషయాన్ని చాటిచెప్పేందుకైనా రాహుల్ స్పందించాలన్నారు.