MLC Kavitha: కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత ప్రియాంక గాంధీకి లేదు, కాంగ్రెస్ పై కవిత ఫైర్

కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

  • Written By:
  • Updated On - October 19, 2023 / 12:49 PM IST

MLC Kavitha: ఇవి తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రేమికుల మధ్య జరుగుతున్న ఎన్నికలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సకల జనులు అంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని తేల్చి చెప్పారు. కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లేనిపోని ఆరోపణలు చేశారని, సత్యదూరమైన అంశాలను మాట్లాడారని అన్నారు. వాళ్లు చెప్పేవి చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రాహుల్ గాంధీ చదువుతున్నారని, రాహుల్ గాంధీ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించడం హాస్యాస్పందంగా ఉందని, కాళేశ్వరం, మిషన్ భగీరథ వ్యయం కలిపితే రూ. లక్ష కోట్ల లోపే ఉందని, రూ.లక్ష కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా చేస్తారన్నది ఆలోచించాలని సూచించారు. ఏదిపడితే అది మాట్లాడితే ఓట్లు వస్తాయనుకోవడం అమాయకత్వమవుతుందన్నారు.

నిజంగా అవినీతియే జరిగి ఉంటే మొత్తం తెలంగాణ రైతుల పొలాలకు నీళ్లు వచ్చేవి కావని, అవినీతి జరిగితే ఇంటింటికి తాగునీరు వచ్చేవి కావని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది కాబట్టి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి కావడానికి 60 ఏళ్ల సమయం పట్టిందని, మొదటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ప్రాజెక్టును కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్తి చేసిన పరిస్థితి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కబెట్టకుండా పోరాటం చేసిన సీఎం కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కమీషన్లు తీసుకుంటే చెరువులకు నీళ్లు రాకపోతుండేనని, అలా చేసి ఉంటే కాంగ్రెస్ హాయంలో రైతుల కళ్లకు కన్నీళ్లు వస్తుండేనని చెప్పారు. పారదర్శకంగా కష్టపడి పనిచేశాము కాబట్టే పోలాల్లో నీళ్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ అష్టకష్టాలు పడిందని, బవలంతంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలపడం వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల గురంచి రాహుల్ గాంధీ ఒక్క సారి కూడా మాట్లాడలేదని, కేంద్రం హామీలు అమలు చేయకపోతే, 7 మండలాలను ఏపీలో కలిపితే కూడా ఏనాడూ రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడలేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానన్నట్లు ఇప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయరటకానీ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానం చేస్తున్నారని విమర్శించారు. మీవి దొంగ వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు, ఆపదమొక్కుల వాగ్దానాలన్న విషయాన్ని ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.

“మోతిలాల్ నెహ్రూ కొడుకు జవహార్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంకా గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గ్లాస్ హౌజులో కూర్చొని ఇతరులపై రాళ్లు విసరరాదు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకొని మాట్లాడాలి” అని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపితే మరి భూమికి హక్కుదారులెవరో ఎలా తెలియాలి ? అని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా ఎలా రావాలే ? అని ప్రశ్నంచారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే ధరణి మాత్రం గ్యారెంటీగా గుళ్ల అవుతుందని, 24 గంటల నిరంతర విద్యుత్తు వచ్చే సమస్యే ఉండదని, గరిష్టంగా 5 గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వలేమని కర్నాటకలో కాంగ్రెస్ మంత్రి అన్నారని వివరించారు. అదే మన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కేవలం మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామంటున్నారని చెప్పారు. రైతులంటే కాంగ్రెస్ కు ఎంత చిన్నచూపో అర్థం చేసుకోవాలని రైతులను కోరారు.

అది వాళ్ల తెలంగాణ… వీళ్ల తెలంగాణ అని కూడా మాట్లాడుతున్నారని, ఇది సకల జనులు కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ అని తేల్చిచెప్పారు. సబ్బండ వర్గాల సంతోషం కోసం, సబ్బండ వర్గాల అభివద్ధి కోసం ప్రజలంతా కలిసి కాంగ్రెస్ మీదే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు… తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్నవని తెలిపారు. “తెలంగాణ వద్దని ప్రజలపైకి రైఫిల్ పట్టుకొని వెళ్లిన రేటెంత రెడ్డిని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి” అని మండిపడ్డారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు నెరవేర్చకపోతే వందలాది మంది యువకుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమయ్యిందని, అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు తెలంగాణ ఎంతగానో అభివద్ధి అయ్యేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాము 10 ఏళ్ల అభివద్ధిని కోల్పోయామన్నారు. “మీరు ఆర్మూరు వస్తారట. సంతోషం. గుత్ప ఎత్తిపోతల పథకాన్ని రూ. 25 కోట్లతో మరమ్మత్తు చేసుకున్నాం. ఫతేపూర్ సుప్రియాల్ లిఫ్ట్, మాక్లూర్ లిఫ్ట్ ఇలా పలు వాటికి రూ. 350 కోట్లు ఖర్చు చేశాము. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులు నింపుకోవడంతో అవి నిండుకుండలలా ఉన్నాయి.” అని రాహుల్ గాంధీని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత అన్నారు.

Also Read: Adilabad: ఓటు అడగొద్దు, మా గ్రామంలోకి అడుగుపెట్టొద్దు.. పొలిటికల్ లీడర్స్ కు గ్రామస్తుల వార్నింగ్