Congress Bus Yatra : ఈ నెల 15 నుంచి తెలంగాణలో బస్సుయాత్రను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎక్కడ జరిగే బస్సు యాత్రలో ఎవరెవరు ముఖ్య నేతలు పాల్గొంటారనే దానికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఈ నెల 9న లేదా 10న జరగనున్న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ నెల 14న అమావాస్య ఉండటంతో ఆ తర్వాతే కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని పీసీసీ కీలక నేత ఒకరు తెలిపారు. వాస్తవానికి అక్టోబర్ మొదటి వారంలోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేశారు. అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉండటం, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరగకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. అలాగే పితృపక్షాల కారణంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో కూడా అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 8న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుందని, ఆ తర్వాత 10న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఒక్కో పేరు పంపిన నియోజకవర్గాలకే తొలుత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. రెండు, మూడు పేర్లు పంపిన సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కో పేరును ఫైనల్ చేసేందుకు సీఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, ఆ మార్గదర్శకాల మేరకు మళ్లీ స్క్రీనింగ్ కమిటీనే ఒక్కో పేరు సూచించాల్సి వస్తుందనే చర్చ ఏఐసీసీ వర్గాల్లో (Congress Bus Yatra) జరుగుతోంది.