PM Modi : లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన మార్చి 16,17,18 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మార్చి 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న మోడీ.. తెలంగాణలో 16,17,18 తేదీల్లో టూర్ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలవాలనే వ్యూహంతో పావులు కదుపుతోంది. అందుకు అక్కడ సభలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మోడీ(PM Modi) మూడు పర్యటనలో భాగంగా చివరి రోజున హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఈనెల 12న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో మూడు వేల మంది సోషల్ మీడియా వారియర్స్తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అవుతారు. ప్రజలను ఆకర్షించేందుకు ఎలాంటి పోస్టులు చేయాలి, వ్యూహాలు రచించాలనే అంశంపై వారికి ఆయన దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో బూత్ అధ్యక్షులు, ఆపై అధికారులతో సమావేశం కానున్నారు. దాదాపు 25 వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 12న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లనున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. లాంఛనంగా ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. అదే వేదిక మీద మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం.
కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ నెల 12న కేేసీఆర్ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. లక్ష మందికి పైగా ప్రజలను సభకు తరలించేందుకు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు.