Modi Public Meet: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ పై మోదీ మనసులో మాట

తెలంగాణలో అధికారాన్ని సంపాదించడం ద్వారా దేశంలో 20 రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 08:14 PM IST

తెలంగాణలో అధికారాన్ని సంపాదించడం ద్వారా దేశంలో 20 రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. వారి మాటలకు ఊతమిచ్చేలా ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తమ ప్రసంగంలో డబుల్ ఇంజిన్ సర్కారు గురించి ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని.. ఈ గడ్డపై డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుందని తేల్చి చెప్పారు.

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం కోసం .. ఇక్కడి ప్రజలే పట్టాలు వేస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతల్లో, కార్యకర్తల్లో, సభకు వచ్చినవారిలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలను, పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభను విజయవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేసిన రాష్ట్ర బీజేపీ నేతలు దీంతో ఫుల్ ఖుషీతో ఉన్నారు.

మోదీ, అమిత్ షా, నడ్డా.. ఇలా పార్టీ ఢిల్లీ ప్రముఖులంతా డబుల్ ఇంజిన్ సర్కారు గురించి బల్లగుద్ది చెప్పడంతో ఆ పార్టీ తెలంగాణపై ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్థమవుతోంది. అందుకే ఇక్కడి ప్రజల మనసెరిగి ముందుకెళ్లడానికి ప్రత్యేక వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ ప్రచారంతో బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణలో కూడా పవర్ లోకి వస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఇప్పటికే ఈ దిశగా క్షేత్రస్థాయిలో, బూత్ లెవల్ లో పొలిటికల్ గేమ్ ను మొదలుపెట్టింది బీజేపీ. అందుకే మోదీ కూడా అంతే హుషారుతో తన ప్రసంగంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్న అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.