PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు. జహీరాబాద్, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు బీబీ పాటిల్, రఘునందన్రావుకు మద్దతుగా ఆయన ఈ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు సభాస్థలికి మోడీ చేరుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రధాని మోడీ(PM Modi) సభకు మెదక్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాల నుంచి దాదాపు రెండు లక్షల మంది కార్యకర్తలను తరలించనున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ శ్రేణులు ఈ సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. సభా స్థలిని ఎస్పీజీ బృందం ఆధీనంలోకి తీసుకోంది. 1,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 30 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. 3 హెలిప్యాడ్లు నిర్మించారు. ఇవాళ సాయంత్రం 5.25గంటల వరకు బహిరంగసభలో మోడీ పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం ఐటీ ఉద్యోగులతో ప్రధాని మోడీ భేటీ అవుతారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్లో 5.55 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
మళ్లీ మే 3న వరంగల్ బహిరంగ సభ.. అది ముగిసిన వెంటనే భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. మే 4న మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణ్ పేటలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్లోని వికారాబాద్లో జరిగే మరో సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మే 8న కరీంనగర్ నియోజకవర్గంలోని వేములవాడలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇక బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా మే 1, 5 తేదీల్లో రెండు విడతలుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మే 1న హైదరాబాద్లో, 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు.