రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఈ నెల 26న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 5 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ముర్ము (President Droupadi Murmu) డిసెంబర్ 26 నుంచి 30 వరకు తెలంగాణలో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 26న సికింద్రాబాద్లోని బొల్లారంలో వీరనారీమణులను సత్కరిస్తారు.
ఈ నెల 28న భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంతో పాటు ములుగు జిల్లా రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. రామప్ప ఆలయ ప్రాంగణంలో రాష్ట్రపతి ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 26న రాష్ట్రపతి శ్రీశైలం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి, వీరనారీమణులను సత్కరిస్తారు. రాత్రి 7.45కి రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఈ నెల 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతో సమావేశమవుతారు. రాష్ట్రపతి తన సంప్రదాయ దక్షిణాది పర్యటనలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే అనేక ఇతర కార్యక్రమాలకు హాజరవుతారని సమాచారం.