కాంగ్రెస్ పార్టీ వైపు పూనం కౌర్ మొగ్గు చూపుతున్నారు. ఆమె రాహుల్ చేస్తోన్ భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలపడం చర్చనీయాంశం అయింది. గత కొన్నేళ్లుగా ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో పరోక్షంగా వినిపిస్తోంది. జనసేనాని పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పూనం కౌర్ పేరు రాజకీయాల్లో నానుతోంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఆమె కాంగ్రెస్ పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ వెంట కనిపించడం హాట్ టాపిక్ అయింది.
సినీ నటి పూనం కౌర్ రాహుల్ గాంధీని కలిసి భారత్ జోడో యాత్రకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఉస్మానియా విద్యార్థులతో పాటు ఆమె రాహుల్ ను కలిశారు. రాహుల్ తో కలిసి పాదయాత్ర చేశారు. రాహుల్ తో నడుస్తూ, ఆయనతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన 20 కిలోమీటర్లు శనివారం నాడు నడవనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం జడ్చెర్లలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ధర్మాపూర్ లో బస చేసిన విషయం విదితమే.
భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టారు. పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురిలో ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభమయింది.