ఖమ్మం (Khammam) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యనేతలు పొంగులేటి (Ponguleti Srinivas), తుమ్మల, పువ్వాడల వ్యవహరం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటం.. ఖమ్మంపై పట్టు సాధించేందుకు ముఖ్యనేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas) పార్టీకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం, భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొంగులేటి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈనెల 18న ఢిల్లీలో ప్రధాని మోదీ., కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas) భేటీ కానున్నారు. ఆ రోజు మోదీ, అమిత్ షాల సమక్షంలో పొంగులేటి కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అనుచరులతో కలిసి భారీ కార్ల ర్యాలీతో ఢిల్లీకి వెళ్లేందుకు పొంగులేటి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులు పోటీ చేస్తారని పొంగులేటి ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ తనను ఎలా సన్మానించిందో, ప్రస్తుతం ఎలా గౌరవిస్తోందో అందరికీ తెలుసని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు సీనియర్ నేత పార్టీని వీడాలని యోచిస్తున్నట్లు పలు సంకేతాలను ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడం కూడా పొంగులేటి పార్టీ మార్పునకు మరో కారణం. అయితే జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్ ఇస్తే మా పరిస్తితి ఏంటి అని? పొంగులేటితో పాటు అనుచరులు సైతం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే పొంగులేటి (Ponguleti Srinivas) బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయంకావడంతో ఖమ్మంలో వరుస పర్యటనలు చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.