భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) త్వరలో తెలంగాణలో (Telangana) పర్యటించనున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు తెలంగాణలో రూ.2,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని బీజేపీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి. మోదీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు బండి సంజయ్కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు ప్రధాని (PM Modi) శంకుస్థాపన చేస్తారని, కాజీపేట (Kazipet)లో పీరియాడికల్ ఓవర్హాలింగ్ (పీఓహెచ్) వర్క్షాప్ నిర్మాణ పనులను రిమోట్గా ప్రారంభిస్తారని వెల్లడించారు. అదేవిధంగా రూ.1,231 కోట్లతో సికింద్రాబాద్-మహబూబ్నగర్ పనులను కూడా ప్రారంభించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ బరిలో మోడీ?
ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవచ్చని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. ఆ కొరతను దక్షిణ రాష్ట్రాల్లో తీర్చుకునేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే.. ఈసారి ప్రధానమంత్రి (PM Modi) నరేంద్రమోదీ.. నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన మహబూబ్ నగర్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు స్థానాలపై ఆల్రెడీ బీజేపీ సర్వే చేయిస్తోందని అంటున్నారు. తెలంగాణలో ఈసారి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ (BJP) నేతలు బలంగా చెబుతున్నారు. బీఆర్ఎస్కి తామే ప్రత్యామ్నాయం అంటున్నారు. దానికి తగ్గట్టే.. ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూ.. ప్రజల నోట్లో నానుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు లాంటి వారు తరచూ వార్తల్లో నిలుస్తూ.. ప్రజల నోట్లో నాలుకవుతున్నారు.
దక్షిణాదిపై బీజేపీ గురి
ఈ పరిస్థితుల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రకటన వస్తే.. పార్టీకి అనూహ్య ఫలితాలు దక్కుతాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సంవత్సరం దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం అక్కడ పార్టీలో కుమ్ములాటలు పెద్దగా లేవు. అధికారంలో ఉన్నందువల్ల తిరిగి అధికారం దక్కించుకోవడం తేలికే అని భావిస్తున్న కాషాయ దళం… కర్ణాటకలో కంటే.. తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేయించడమే ఉత్తమం అని భావిస్తోంది.