వచ్చే నెల 8న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్కు వస్తారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రూ. 700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులకు, ఎంఎంటిఎస్ రెండోదశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని ఏప్రిల్ 8న ప్రారంభిస్తారని చెప్పారు. మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే రైల్వే అధికారులతో చర్చించామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. గతంలో అధికార పర్యటలను జరగాల్సి ఉన్నా వివిధ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోయారు. కాగా.. వచ్చేనెల 8వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అధునాతన స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్దరించనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో పాటు సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Also Read: ISRO To Launch LVM3-M3: నేడు ఎల్వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగం
అదేవిధంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం అదేరోజున బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. గతంలో పర్యటనలు వాయిదా పడటంతో ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ నగరానికి ప్రధాని వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా పర్యటన ఖరారైన వెంటనే ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను అధికారులు చేపట్టనున్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.