ఆర్టీసీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం.
అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది’’ అని కోరింది.
కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, విడతల వారీగా ఆ బస్సులను ఉపయోగంలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.