గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) లో ప్రతీ ఏరియాలో పార్కులు ఉంటాయి. స్థానిక ప్రజలు, చిన్నారులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసం సేదతీరేందుకు పార్కులకు వస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో పేరుపొందిన పార్కులు (Parks) ఉన్నాయి. వీటిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీగా ఉంటాయి. పార్కులను సందర్శించేందుకు ఇతర ప్రాంతాల నుంచికూడా వస్తుంటారు. అయితే, గురువారం హైదరాబాద్ లోని పార్కులు మూతపడనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉంది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న (గురువారం) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది. పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్లను మూసివేయనున్నారు.