CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్లోకి రావాలని కోరడం సరికాదన్నారు. ఇలా చేయడం ద్వారా సీఎం రేవంత్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయం రేవంత్కు చెబుదామంటే.. ఆయన కనీసం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.‘‘రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి.. మిమ్మల్ని కలవాలంటే మీ దగ్గరకే వాళ్లు రావాలి. మీరు వాళ్ల దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం సరికాదు. మీ స్థాయి మీరే తగ్గించుకుంటున్నారు’’ అని వీహెచ్ కామెంట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
అతి తక్కువ టైంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక్కరే అని వీహెచ్ కొనియాడారు. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ గెలిపించారని కితాబిచ్చారు. ‘‘కానీ ఇప్పుడు పరిస్థితులను చూసి కార్యకర్తలు బాధపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారు. కాంగ్రెస్ కేడర్కు న్యాయం చేయకుండా మన కార్యకర్తలపై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని వివిధ పార్టీల్లో నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు’’ అని వీహెచ్ వివరించారు. ‘‘సీఎం రేవంత్ గారు ఒక్క సైడ్ మాత్రమే వినొద్దు.. రెండు సైడ్స్ వినాలి. పార్టీ కార్యకర్తలలకు అన్యాయం చేయకండి. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు.. ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేదే నా ఆవేదన’’ అని వీహెచ్ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేయాలని భావించగా.. టికెట్ రాలేదు. అయితే ఒకానొక సమయంలో తాను కూడా సీఎం రేసులో ఉన్నానని వీహెచ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాగా.. ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వాలని వీహెచ్ పట్టుబట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఆయనకు సీటు ఇవ్వడం కుదరదని పార్టీ వర్గాలు తేల్చిచెప్పాయి.