Onion Prices : ఉల్లి ధరల మంట సామాన్యులకు దడ పుట్టిస్తోంది. మే 25న కిలో ఉల్లి ధర రూ. 17 ఉండగా.. ఇప్పుడు దాదాపు 30 శాతం నుంచి 50 శాతం మేర పెరిగిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఉల్లి ధర అమాంతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 33కు చేరింది. ఇక రిటైల్ మార్కెట్లో రూ. 40 నుంచి రూ. 50 దాకా పలుకుతోంది. దేశంలోనే ఉల్లి అత్యధికంగా లభ్యమయ్యే మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న లాసల్గావ్ మండిలో కిలో ఉల్లిగడ్డ హోల్సేల్ ధర రూ.30 ఉంది. కిలో ఉల్లి ధర చెన్నైలో గరిష్టంగా రూ.50 నుంచి రూ.70 దాకా పలుకుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
మహారాష్ట్ర నుంచి దక్షిణాది రాష్ట్రాలకు నిత్యం పెద్దఎత్తున ఉల్లిపాయల(Onion Prices) ఎగుమతి జరుగుతుంటుంది. ఎగుమతి సుంకం రేట్లు పెరగడం వల్ల కూడా ఉల్లిరేట్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్లో ఉల్లి సాగు తగ్గిపోవడంతో మార్కెట్లో వాటి లభ్యత డౌన్ అయిందని అంటున్నాయి. అందుకే రేట్లు పెరిగాయని పేర్కొంటున్నారు.
రాబోయే వారం రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. రూ.20 ఉండే కిలో వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి చేరాయి. బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. కిలో టమాటా రేటు రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. పప్పు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు సైతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.