Site icon HashtagU Telugu

Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి నోటీసులు

Police Notices Brs Mlc Pochampally Srinivas Reddy

Pochampally Srinivas Reddy : కోడి పందేల వ్యవహారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని వెంటాడుతోంది. హైదరాబాద్ నగర శివారులో మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామం సర్వే నంబరు 165/ఏలో శ్రీనివాస్‌ రెడ్డికి ఫామ్‌హౌస్‌ ఉంది. గత నెల (ఫిబ్రవరి)లో ఈ ఫామ్ హౌస్‌లో భారీగా కోడి పందేలు, కేసినో నిర్వహించారు. దీంతో 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని కూడా నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4తో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 13న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు పంపిన మొయినాబాద్ పోలీసులు.. తాజాగా ఇవాళ(గురువారం) కూడా మరోసారి నోటీసులు పంపారు.

Also Read :Heart Attack : గుండెపోటుకు వ్యాక్సిన్.. ఇలా పనిచేస్తుంది

మార్చి 14న విచారణకు రండి

రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా మొయినాబాద్ పోలీసు స్టేషనులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్కిడ్స్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులను(Pochampally Srinivas Reddy) అందజేశారు. వీటిపై పోచంపల్లి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. తొలిసారిగా నోటీసులు ఇచ్చిన సందర్భంలో పోలీసులకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన లాయర్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. ఆ ఫామ్ హౌస్‌ను రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని తెలిపారు. తాను ఆ ఫామ్ హౌస్‌కు వెళ్లి ఎనిమిది ఏళ్లు అయిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు ఆయన అందజేశారు. రేపు (శుక్రవారం) విచారణ క్రమంలో ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై  పోచంపల్లి నుంచి పలు లీగల్ వివరాలను పోలీసులు సేకరిస్తారని తెలుస్తోంది.

Also Read :Smart Ration Cards: ఇక అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇలా ఉంటాయ్

పోచంపల్లికి తెలియకుండానే.. ? 

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరఫు న్యాయవాది వెల్లడించిన వివరాల ప్రకారం..  2018లో మొయినాబాద్‌‌లో 10.01 ఎకరాల భూమిని పోచంపల్లి కొన్నారు. అప్పటి నుంచి ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలను, ఆయన మేనల్లుడు జ్ఞాన్‌దేవ్‌ రెడ్డి చూస్తున్నారు. అక్కడ ఎలాంటి ఫామ్‌ హౌస్‌ లేదు. మామిడి తోట, కొబ్బరి తోటతో పాటు పని చేసేవారి కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. పోచంపల్లి  ప్రమేయం లేకుండానే ఆయన మేనల్లుడు ఈ తోటను వర్రా రమేశ్‌ కుమార్‌ రెడ్డికి, తదుపరిగా రమేశ్‌ కుమార్‌ రెడ్డి ఈ తోటను వెంకటపతి రాజుకు కౌలుకు ఇచ్చారు. కోడి పందేల విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత  ప్రశ్నిస్తే.. ఈవిషయాన్ని మేనల్లుడు తనతో చెప్పాడని పోచంపల్లి అంటున్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.