Site icon HashtagU Telugu

Indiramma Houses Scheme Survey : మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే .. లబ్ధిదారుల్లో ఆందోళన

Once Again Indiramma Houses

Once Again Indiramma Houses

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses Scheme) కింద లబ్ధిదారులపై మరోసారి సర్వే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలు తిరిగి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పాటు కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉండటంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ యాప్‌లో ప్రతి లబ్ధిదారుడి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ముఖచిత్రంతో పాటు బయోమెట్రిక్ వివరాలు అవసరమవ్వడంతో కొన్ని గ్రామాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని కార్యదర్శులు అంటున్నారు.

ఈ యాప్‌లో దాదాపు 60 వరకు వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఆధార్, పేరు, బ్యాంకు ఖాతా, కుటుంబ వివరాలు వంటి సమాచారాన్ని లబ్ధిదారులు తగిన సమయంలో ఇవ్వకపోవడం, వారి అందుబాటులో లేకపోవడం, పాత ఫోన్లలో యాప్ సరిగా పని చేయకపోవడం, ఫోటో లేదా బయోమెట్రిక్ వివరాలు సరిపోకపోవడం లాంటి సమస్యలతో సర్వే ఆలస్యమవుతోంది. కొన్ని గ్రామాల్లో యాప్ పనిచేయకపోవడం వల్ల పలు మండలాల్లో సర్వే ఆగిపోయినట్లు సమాచారం.

WTC Test Matches: డ‌బ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్లు ఇవే!

ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో కలిపి 5,910 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు 1,300 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలోకి ప్రవేశించాయి. అందులో 700 ఇళ్లు పునాది దశ దాటగా, 600 ఇళ్లకు రూ.లక్ష చొప్పున బిల్లులు విడుదల చేశారు. పురపాలికల్లో మంజూరైన 1,000 ఇళ్లు మినహాయిస్తే, మిగిలిన 4,910 ఇళ్లకు తిరిగి సర్వే చేయాల్సి రావడం అధికార యంత్రాంగానికి అదనపు భారం అయింది.

ఇంటి నిర్మాణం మొదలైన తరువాత ఖాళీ స్థలం ఫోటో తీసి నమోదు చేయాలన్న నిబంధనకు విరుద్ధంగా ఇప్పటికే అనేక ఇళ్లలో పునాది నుంచి లెంటల్ స్థాయికి చేరుకునే వరకు పనులు జరిగిపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం.. పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతోంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో యాప్ మరింత మందికి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 215 ఇళ్లకే సర్వే పూర్తయిందని తెలుస్తోంది. ఇది పూర్తి చేయాలంటే అధికారులు మరిన్ని రోజులు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.