తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన పరువు నష్టం ఆరోపణల కేసులో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో, ప్రజా ప్రతినిధుల కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 2024 అక్టోబర్లో హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో సురేఖ, కేటీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించడమే కాకుండా, కేటీఆర్ ‘డ్రగ్స్ అడిక్ట్’ అని, రేవ్ పార్టీలు నడుపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుమించి, టాలీవుడ్ ప్రముఖులు నాగ చైతన్య – సమంత విడాకులకు కేటీఆర్ కారణమని, ఈ విషయంలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీని కూడా లాగి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచింది.
Ration Card : తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు
మంత్రి సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విస్తృతంగా ప్రచారమయ్యాయి, ఇది కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠకు తీవ్రంగా భంగం కలిగించింది. తన 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి అపఖ్యాతిని ఎదుర్కోలేదని, తన ప్రతిష్ఠకు, కుటుంబానికి గాయమైందని పేర్కొంటూ కేటీఆర్ మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన మొదట సురేఖకు లీగల్ నోటీస్ పంపి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సురేఖ స్పందించకపోవడంతో, కేటీఆర్ హైదరాబాద్లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ డిఫమేషన్ కంప్లైంట్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను నూతన చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 356 (క్రిమినల్ డిఫమేషన్) మరియు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్లు 222, 223 కింద దాఖలు చేశారు. ఈ ఆరోపణలకు మద్దతుగా వీడియో రికార్డింగ్లు, న్యూస్పేపర్ క్లిప్పింగ్లు, హైపర్లింక్లు, పెన్ డ్రైవ్లను కేటీఆర్ కోర్టుకు సమర్పించారు.
కేటీఆర్ పిటిషన్ను స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ పరిశీలించి, కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కోర్టు ప్రాథమిక సాక్ష్యాలను సమీక్షించిన తర్వాత, సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. అలాగే సురేఖ ఇకపై మరిన్ని పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించడమే కాకుండా, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ వంటి ప్లాట్ఫారమ్ల నుంచి తొలగించాలని ఆదేశించింది. అక్కినేని ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగడంపై నటుడు అక్కినేని నాగార్జున కూడా 2024 అక్టోబర్లో సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే, సురేఖ 2025 నవంబర్లో నాగార్జునకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో, ఆయన కేసును విత్డ్రా చేసుకున్నారు. కానీ కేటీఆర్కు మాత్రం క్షమాపణలు చెప్పకపోవడంతో, ఆయన దాఖలు చేసిన కేసు కొనసాగుతూ, ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే స్థాయికి చేరింది.
