కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వ్యవహారంపై మల్లు రవి (Mallu Ravi) అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హైకమాండ్ సూచించిందని గుర్తు చేశారు. అయినా కూడా బహిరంగంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వారి సమస్యను అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. సాయంత్రం జరిగే సమావేశానికి సీనియర్లు వస్తారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అలాగే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పలువురు ‘టీడీపీ’ నుంచి వలస వచ్చిన వారికి ఆఫీస్ బేరర్లుగా చోటు కల్పించారన్న పలువురు సీనియర్ నేతల వాదనను తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) తోసిపుచ్చారు. 22 మంది సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మినహా టీడీపీలో నుంచి వచ్చిన వారు ఎవరూ లేరని, 40 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరు మాత్రమే ఉన్నారని రవి ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: T Congress: టీ కాంగ్రెస్ కు ఏమైంది.. రేవంతే టార్గెట్గా సీనియర్ల తీరు..!
24 మంది ఉపాధ్యక్షులలో ఐదుగురు మాత్రమే టిడిపి నుండి, 84 ప్రధాన కార్యదర్శులలో టిడిపి నుండి ఐదుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. 26 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి సంబంధించి టీడీపీకి చెందిన వారెవరూ లేరని, కొత్తగా విడుదల చేసిన ఆఫీస్ బేరర్ల జాబితాలో 68 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉండగా, మిగిలిన వారు ఇతర కులాలకు చెందిన వారని రవి చెప్పారు. సామాజిక న్యాయం పూర్తిగా అనుసరించినట్లు పేర్కొన్నారు.