Nizamabad Urban : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఇంటిపెండెంట్ గా పోటీ చేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్ (36) ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయినగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉరి వేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే అతడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కన్నయ్య గౌడ్ మృతిచెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.
We’re now on WhatsApp. Click to Join.
యమగంటి కన్నయ్యగౌడ్ ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండు రోజుల్లో గృహప్రవేశం కూడా ఉంది. ఈలోపు కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని, తన ఎన్నికల అఫిడవిట్ను దొంగిలించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫోన్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు(Nizamabad Urban) అప్పగించనున్నారు.